చెట్టంత మనిషి అని, చెట్టంత ఎదిగాడు అంటారు.ఈ విశ్వం అంతా పంచ భూతాత్మకమైనదే. చెట్లు తదితరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలూ ఉన్నాయి. వాటిక్కూడా మనిషికిలాగే వినటం, వాసన చూడటం, రసం, స్పర్శ, దృష్టి అనే ఐదు ఇంద్రియాలూ ఉన్నాయి. అవి ఇతర జంతువులకులాగా పైకి కనిపించక పోవచ్చు. అంతమాత్రం చేత వాటిని లేవు అని అనటానికి వీలు లేదు. వృక్షాల్లోనూ ఆకాశమనేది ఉంది. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు రాలిపడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి ఆ చెట్లకుంది.తీగలు చెట్లను చుట్టుకొని, లేదంటే పందిరికి ఎగబాకుతూ ముందుకు సాగిపోతుంటాయి. ముందుకు పోవాలంటే, ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి.
ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది. పవిత్రమైన గంధం కానీ, ధూపం కానీ ఆ చెట్లకు సోకినప్పుడు అవి చక్కగా ఎదుగుతుంటాయి.సుఖ దుఃఖాలను పొందే లక్షణాన్ని అవి కలిగి ఉన్నాయి . మనిషిలో ఎలా పరిణామ క్రమం ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవ్వటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంత కాలానికి వయస్సుడిగి నశించటం ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది. వాయువును గ్రహించటం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, ఆహారం మారినప్పుడు తరగటం, పెరగటం ఇవన్నీ చెట్లలో కనిపిస్తుంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధ పడుతున్నట్లు నీరసించినట్టు కనపడుతుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషి లాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనపడుతుంది.