మనఊరు మనచెట్టు: ట్రీ మ్యాన్ కు లాస్ట్ సెల్యూట్… 50లక్షల మొక్కలు నాటి కన్నుమూత.

Sunday, January 20, 2019

ట్రీ మ్యాన్ కు లాస్ట్ సెల్యూట్… 50లక్షల మొక్కలు నాటి కన్నుమూత.

#RIP #TREEMAN #manaurumanachettu #praneethkumarsharma #manaurumanachettu_official

వాతావరణం కలుషితం కాకుండా ఉండాలని తపనపడ్డాడు. స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాల్గొన్న సమరయోధుడు. ఆయనే విశ్వేశ్వర్ దత్ సక్లానీ. మన దేశానికి మాత్రం ఆయన వృక్ష మానవ్.. ట్రీ మ్యాన్ గా చాలామందికి తెలుసు. బతికి ఉన్నన్నాళ్లు ఆయన పచ్చదనం కోసం పరితపించాడు. ఎక్కడ బంజరుభూములు కనపడ్డా… మొక్కలు నాటుతూ పోయాడు. అలా.. ఏకంగా యాభై లక్షలకు పైగా మొక్కలు నాటాడు. ఈ ప్రకృతి ప్రేమికుడు… 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు.

విశ్వేశ్వర్ దత్ సక్లానీది ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రి జిల్లా. 1922 జూన్ 2న పుట్టాడు. మొక్కలంటే చిన్నప్పటినుంచే ప్రాణం పెట్టాడు. 8 ఏళ్ల వయసులోనే మొదటి మొక్క నాటాడు. ఒక్క తెహ్రి జిల్లాలోనే యాభై లక్షల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించాడు. ఆయన మొక్కలు నాటేటప్పుడు అవన్నీ బీడు, బంజరు భూములు. ఇపుడు పచ్చదనం నింపుకున్న వనాలయ్యాయి.

పదేళ్ల కిందట సక్లానీ కంటిచూపు పోయింది. మొక్కలు నాటుతున్నప్పుడు దుబ్బ, చెత్త, మట్టి కళ్లలోకి పోవడంతో… ఆయన చూపు పోగొట్టుకున్నారు. కంటి చూపు పోయిన తర్వాత కూడా వేలాది మొక్కలు నాటారు విశ్వేశ్వర్ దత్ సక్లానీ.

ఈ ‘చెట్టు మనిషి’ హరితయజ్ఞం అంత ఈజీగా సాగలేదు. భూముల్లో మొక్కలు నాటుతుంటే చాలామంది అతడిని కబ్జాకోరు అన్నారు. చెట్లు పెంచి.. వ్యాపారం చేస్తాడేమో అని వెక్కిరించారు. కానీ తర్వాత ఆయన నిస్వార్థంగా చెట్లు పెంచాడు. ఆ రాష్ట్రంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇపుడు ఆ గొప్ప మనిషి లేడు. కానీ… ఆయన నాటిన మొక్కలు మాత్రం వనాలై కోట్లాదిమందికి ప్రాణవాయువు అందిస్తున్నాయి. హి ఈజ్ గ్రేట్. లాస్ట్ సెల్యూట్ టు ట్రీ మ్యాన్.